ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్లకు సంబంధించి రీషెడ్యూల్ వచ్చేసింది. మే 17 నుంచి ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కానుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ జరగనుంది. ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఒకింత సద్దుమణగడంతో బీసీసీఐ అత్యవసరంగా సమావేశమై ఐపీఎల్ తదుపరి షెడ్యూల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
మిగిలిన 17 మ్యాచ్ల కోసం దేశంలో ఆరు వేదికలను ఖరారు చేసింది. ఇందులో జైపూర్, ముంబయి, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ ఉన్నాయి. ఈ లీగ్ మ్యాచుల్లో ఒక్కటి కూడా ఉప్పల్, విశాఖ స్టేడియాల్లో నిర్వహించకపోవడం తెలుగు రాష్ట్రాల అభిమానులకు నిరాశ కలిగించే విషయం.
మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు బెంగళూరు వేదికగా ఆడనున్నాయి.మే 18న మధ్యాహ్నం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్- పంజాబ్ కింగ్స్, మే 18 రాత్రి ఢిల్లీ వేదికగా ఢిల్లీ – గుజరాత్ మ్యాచ్ జరగనుంది. మే 19న లక్నో వర్సెస్ సన్రైజర్స్, మే 20న సీఎస్కే వర్సెస్ రాజస్థాన్, మే 21న ముంబై వర్సెస్ ఢిల్లీ, మే 22న గుజరాత్ వర్సెస్ లక్నో, మే 23న ఆర్సీబీ వర్సెస్ సన్రైజర్స్, మే 24న పంజాబ్ వర్సెస్ ఢిల్లీ, మే 25 మధ్యాహ్నం గుజరాత్ వర్సెస్ సీఎస్కే, మే 25 రాత్రి సన్రైజర్స్ వర్సెస్ కేకేఆర్, మే 26న పంజాబ్ వర్సెస్ ముంబై, మే 27న లక్నో వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లు జరగనున్నాయి.
ఈ క్రమంలో రెండు ఆదివారాలు లీగ్లో డబుల్ హెడర్ మ్యాచ్లు ఉండనున్నాయి. లీగ్ షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. మే 29 నుంచి క్వాలిఫయర్-1తో ప్లేఆఫ్స్ ప్రారంభమవుతాయి. మే 30న ఎలిమినేటర్, జూన్ 2న క్వాలిఫయర్-2, జూన్ 3న ఫైనల్ జరుగనున్నాయి. అయితే, ప్లేఆఫ్స్ వేదికలను మాత్రం ఇంకా బీసీసీఐ ఖరారు చేయలేదు.
ఇక ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో ప్లేసులో, పంజాబ్ కింగ్స్ మూడు, ముంబై ఇండియన్స్ నాలుగో ప్లేసులో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించాయి.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/