IPL 2025 లో ఆర్సీబీ ఫైనల్స్ కు చేరుకుంది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట పంజాబ్ కింగ్స్ ను 101 పరుగులకే ఆల్ అవుట్ చేసిన ఆర్సీబీ, లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10 ఓవర్లలో ఛేదించి ఐపీఎల్ 2025 ఫైనల్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలకమైన మ్యాచ్లో కూడా సత్తా చాటింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి పంజాబ్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. భారీ అంచనాలతో టాప్ 2 లోకి వచ్చిన పంజాబ్, కీలక మ్యాచ్ లో చేతులెత్తేసింది.
టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్పై పంజాబ్ బ్యాటర్లు తేలిపోయారు. భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. మార్కస్ స్టోయినిస్ (26) తప్ప మరెవ్వరూ 20 పరుగులు కూడా చేయలేదు. దీంతో పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు ముందు స్వల్ప టార్గెట్ మాత్రమే ఉంచింది.
సుయాష్ శర్మ, హాజెల్వుడ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. యశ్ దయాల్ రెండు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, షెప్పర్డ్ ఒక్కో వికెట్ తీశారు.
102 పరుగుల లక్ష్యంతో దిగిన ఆర్సీబీ మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ గేమ్ ఆడింది. కోహ్లీ అవుటైనా మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56) మాత్రం తన ఫామ్ను కొనసాగించాడు. ఈ సీజన్లో నాలుగో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫోర్లు, సిక్స్లతో హోరెత్తించాడు. అతడికి మయాంక్ అగర్వాల్ (19) కూడా సహకరించాడు. దీంతో ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పంజాబ్ నిర్దేశించిన టార్గెట్ను 10 ఓవర్లలోనే ఛేదించింది.
శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో ఆదివారం జరిగబోయే క్వాలిఫయర్-2లో పంజాబ్ తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది.
For more related news : https://theshakthi.com/category/categories/trending-news/