vaibhav

RR vs GT : పిల్లోడు కాదు సిక్సర్ల పిడుగు!

గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 16 ఏళ్ళ కుర్రాడు చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ బ్యాట్స్ మెన్ వైభవ్ సూర్యవంశీ జైపూర్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. 35 బంతుల్లో 11 సిక్సర్లు, 7 ఫోర్లతో 101 పరుగులు చేసాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ కాగా, ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన తొలి ఇండియన్ గా రికార్డు సృష్టించాడు.

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసింది. శుభ్‌మన్ గిల్‌తో పాటు మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (39) తన ఫామ్‌ను కొనసాగించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించారు.

సుదర్శన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన జాస్ బట్లర్ (50) కూడా బౌండరీలతో ఆర్‌ఆర్ బౌలర్లను బెంబేలెత్తించాడు. సెంచరీకి చేరువవుతున్న సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించి గిల్ అవుటయ్యాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది.

210 పరుగుల ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా 16 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ అనుభవం ఉన్న గుజరాత్ బౌలర్లపై అటాక్ చేసాడు. సిక్సర్ తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వైభవ్, ఇన్నింగ్స్ మొత్తంలో 11 సిక్సర్లు కొట్టాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు.

మరో ఓపెనర్ జైస్వాల్ కూడా తన ఫామ్ ను కొనసాగించడంతో 10 ఓవర్లకే వికెట్ నష్టపోకుండా 144 పరుగులు చేసింది. సెంచరీ పూర్తి చేసాక వైభవ్ అవుట్ అయినా అప్పటికే మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లో ఉంది. ఆ తరువాత నితీష్ రానా కూడా అవుట్ అయ్యాడు. మరో వికెట్ పడకుండా కెప్టెన్ పరాగ్, ఓపెనర్ జైస్వాల్ మ్యాచ్ ని పూర్తి చేసారు. జైస్వాల్ 70 పరుగులు చేయగా, పరాగ్ 15 బంతుల్లో 32 పరుగులు చేసాడు.